నేరాల నియంత్రణకు కార్డన్ అండ్ సెర్చ్
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్
భూపాలపల్లి, జనవరి 25(అక్షర సవాల్):
జిల్లా కేంద్రంలోని అంబేత్కర్ సెంటర్ నుంచి జయశంకర్ విగ్రహం వరకు గల ఏరియాలో ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధృవ పత్రాలు లేని 48 బైక్ లు, 40 లీటర్ల మద్యం, 28 లీటర్ల గుడుంబా, నెంబర్ ప్లేట్ లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని పోలిసు స్టేషన్ కు తరలించారు. సంబంధిత వాహనాల యజమానులు ధ్రువపత్రాలను పోలీస్స్టేషన్లో చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారన్నారు. నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలకు భద్రత కల్పించడంలో రాజీ పడేది లేదన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరస్తులు ఆశ్రయం పొందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్ప డితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కావొద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ కోరారు.
అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ కాలనీల్లో క్రైమ్స్ జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పదమైన వ్యక్తులు గానీ, అనుమానాస్పదమైన వాహనాలు గానీ కాలనీలో కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ క్రైమ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ వేణు చందర్, భూపాలపల్లి ఎస్సైలు, శ్రావణ్, సంధ్యారాణి, శ్రీనివాస్, ఘనపురం ఎస్ఐ సాంబమూర్తి, రేగొండ ఎస్సై రవికుమార్, మొగుళ్ళపల్లి ఎస్సై మాధవ్ చిట్యాల ఎస్సై రమేష్, టేకుమట్ల ఎస్సై సుధాకర్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది, భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.