2 కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
మంగపేట, ఆగస్టు 18 ( అక్షర సవాల్ ) : మత్తు పదార్ధాలను నిర్మూలించాలని కోరుతూ ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో హోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆగష్టు 29న నిర్వహించనున్న 2 కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఖాలీద్ పిలుపునిచ్చారు. 2 కె రన్ కార్యక్రమానికి సంభందించిన పోస్టర్లను మండల కేంద్రమైన మంగపేటలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఖాలీద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత చెడు అలవాట్లకు బానిసై తమ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారని , మత్తు పదార్థాలు సేవించడం వలన యువత తమ ఉజ్వలమైన భవిష్యత్ కోల్పోతున్నారని అన్నారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండడం, మత్తు పదార్థాలకు బానిస అవడం వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఆగష్టు 29న మంగపేట మండల కేంద్రంలో 2కె రన్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సయ్యద్ ఖలీద్ కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు సుంకోజు ప్రశాంత్, మినాజ్ హుస్సేన్, సయ్యద్ ఫయాజ్ , మురుకుట్ల నరేందర్, శశి కుమార్, సాయికిరణ్, రహమత్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.