నెక్కొండ మండలంలో అదనపు కలెక్టర్ పర్యటన
మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై అధికారులకు కీలక ఆదేశాలు
నెక్కొండ,అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ,రాబోయే వరి సీజన్కు సంబంధించిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని,అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అనంతరం మండలంలోని ఖాళీ గోదాములను పరిశీలించి,మొక్కజొన్న,వరి నిల్వలకు తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు.నిల్వ సామర్థ్యాన్ని పెంచి రైతుల పంట సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాజ్కుమార్,వ్యవసాయ అధికారి ఎ.నాగరాజు,ఎంపీడీవో లావణ్య,వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి,ఏఈఓలు,గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

