జాతీయ స్థాయిలో మెరిసిన వరంగల్ యువ వైద్యుడు
ఆయుర్వేద పీజీ పరిశోధనా శిక్షణ పథకానికి డాక్టర్ కాముని పవన్ కుమార్ ఎంపిక
దేశవ్యాప్తంగా 1519 మందిలో 200 మందికి మాత్రమే అవకాశం
లక్ష రూపాయల పరిశోధన నిధుల సాధన
గీసుగొండ, మే 16 అక్షర సవాల్: ఆయుర్వేద వైద్య విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పీజీ పరిశోధనా శిక్షణ పథకానికి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థి డాక్టర్ కాముని పవన్ కుమార్ ఎంపిక కావడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా వచ్చిన 1519 దరఖాస్తుల్లో కేవలం 200 మంది మాత్రమే ఎంపిక కాగా, వారిలో పవన్ కుమార్ చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన కాముని రాజేష్, సుజాత దంపతుల కుమారుడైన పవన్ కుమార్ ప్రస్తుతం ప్రముఖ అధ్యాపకురాలు డాక్టర్ సి.హెచ్. రమాదేవి మార్గదర్శకత్వంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కఠినమైన జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చాటుతూ ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పరిశోధనా శిక్షణ పథకానికి ఎంపికైన విద్యార్థులకు ప్రోత్సాహంగా కేంద్ర ఆయుర్వేద పరిశోధనా మండలి పరిశోధనల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ నిధులు లభించడం ద్వారా పవన్ కుమార్ పరిశోధనలకు మరింత బలం చేకూరనుంది. పవన్ కుమార్ సాధించిన ఈ అరుదైన ఘనతపై కళాశాల అధ్యాపకులు, సహచర విద్యార్థులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆయుర్వేద పరిశోధనలకు యువత ప్రతిభను చాటుతున్న ఉదాహరణగా నిలిచారని కొనియారు.

