భూపాలపల్లి పోలిసు శాఖ ట్రాఫిక్ అడ్వైజరీ
-ట్రాఫిక్ మల్లింపును వాహనదారులు పాటించాలి : జిల్లా ఎస్పి
భూపాలపల్లి, ఫిబ్రవరి 19(అక్షర సవాల్):
తెలంగాణలో అత్యంత ఘనంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు జయశంకర్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు, భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మీదుగా మహారాష్ట్ర వాహనాలతో పాటు, వివిధ జిల్లాల వాహనాలు, చేరుకోవడం, తిరుగు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పి కోరారు.ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపును ప్రజలు, వాహనదారులు పాటించాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, పెద్దపల్లి, మంచిర్యాల, వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు, కాటారం, చింతకాని క్రాస్ రోడ్ నుండి యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం మీదుగా కాల్వపల్లి క్రాస్ నుంచి మేడారం, చేరుకుని, తిరుగు ప్రయాణంలో అదే రూట్ లో తమ గమ్యస్థానానికి చేరుకోవాలి, ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు మాత్రం కాటారం భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, ఘనపూర్, జంగాలపల్లి, పసరా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుని తిరిగి ఇదే మార్గం గుండా తిరుగు ప్రయాణం చేస్తాయి. హన్మకొండ, వరంగల్, హైదరాబాద్ అదే రూట్ నుంచి వచ్చే వివిధ ప్రైవేట్ వాహనాలు ములుగు, పసరా మీదుగా మేడారం చేరుకుని మేడారం మార్గం వన్ వే ఉన్న నేపథ్యంలో నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి రాంపూర్, భూపాలపల్లి రేగొండ మీదుగా వారి గమ్య స్థానాలకు చేరుకుంటారు, ఈ రూట్ లో కచ్చితంగా వన్ వెలో మాత్రమే వాహనాలు నడుస్తాయి. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా జిల్లా ప్రజలు వన్ వే వాహనాలకు ఎదురు ప్రయాణం చేయవద్దని ఎస్పి కోరారు. భూపాలపల్లి పట్టణం మరియు సమీప ప్రాంతాల ప్రజలు మేడారం జాతర కోసం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసే ప్రజలు, చెల్పూర్, గాంధీనగర్, ఘనపూర్, జంగాలపల్లి పసరా మీదుగా ప్రయాణం చేయాలని, తిరుగు ప్రయాణంలో వన్ వే మార్గంలో తమ గమ్య స్థానం చేరుకోవాలని వెల్లడించారు. మేడారం జాతర నేపథ్యంలో ఇసుక లారీ లకు అనుమతి లేదని ఎస్పి కిరణ్ ఖరే స్పష్టం చేశారు. భక్తుల భద్రత లక్ష్యంగా పోలీసులు, పనిచేస్తున్నారని, ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితిలో పోలీసులకు గానీ లేదా డయల్ -100 కు ఫోన్ చేయాలని ఎస్పి తెలిపారు.