రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎస్ హెచ్ ఓ లు తమ పరిధి గ్రామాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
-ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలి…జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్
భూపాలపల్లి, ఆగష్టు 23 (అక్షర సవాల్) :
రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సీఐలు, ఎస్ హెచ్ ఓ లతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి, భాదితులకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసుల పనితీరు ఉండాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా బైండోవర్, ఎక్సైజ్ కేసులు , NBW అమలు, ఆయుధాల డిపాజిట్ పై దృష్టి పెట్టాలని అన్నారు. నేర నియంత్రణకు, నేర చేధనకు ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలని ఎస్పి అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పి రామోజు రమేష్, ఏ. ఆర్ అదనపు ఎస్పీ వి శ్రీనివాస్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ. రాములు, జి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు.