రేపు నూతన జిల్లా పోలిసు కార్యాలయం ప్రారంభం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్.
భూపాలపల్లి, అక్టోబర్ 8(అక్షర సవాల్):
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరియు మంత్రుల బృందం రేపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ. 25.90 కోట్ల వ్యయంతో, 37 ఏకరాల స్థలంలో, 50,263 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మించిన భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు. రేపు మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎస్పి భూపాలపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పోలీసు బందోబస్తు, హెలిప్యాడ్ స్థలం, పబ్లిక్ మీటింగ్ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి పట్టణంలో రేపు డబుల్ బెడ్ రూం, కలెక్టర్ కార్యాలయాన్ని మరియు వివిధ ప్రారంభోత్సవాలతోపాటు, పబ్లిక్ మీటింగ్లో పాల్గొననున్నారని తెలిపారు. మంత్రుల పర్యటనలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేపట్టాలని ఎస్పీ కరుణాకర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. రూట్ బందోబస్తు, హెలిప్యాడ్ బందోబస్తు, బహిరంగ సభ బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఎస్పి కరుణాకర్ పలు సూచనలు చేశారు. రేపటి మంత్రుల బందోబస్తు సందర్బంగా జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని, దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఏఆర్ అదనపు ఎస్పీ వి. శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.