గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎస్పి పుల్లా కరుణాకర్ పర్యటన.
భూపాలపల్లి, జూలై 28(అక్షర సవాల్):
భారీ వర్షాలతో పాటు, ఎగువన ఉన్న ప్రాజెక్టు ల నుంచి వరదను దిగువకు వదులుతున్నందున గోదావరి నది ఉదృతీ ఎక్కువ అవ్వడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. శుక్రవారం అన్నారం బ్యారేజ్ కు వెళ్ళి అక్కడ వరద ఉదృతిని పరిశీలించారు. అలాగే వరద ప్రభావిత గ్రామం పుసుకుపల్లిని , కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అంతేకాకుండా కాళేశ్వరంలో పుష్కర ఘాట్ ల వద్ద వరద ఉదృతి ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ గోదావరికి వరద క్రమేపి పెరుగుతున్నందున పర్యాటకులు మేడిగడ్డ, అన్నారం వెళ్లవద్దని అన్నారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే ఇండ్ల నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లాలోని వాగులు,వంకలు,చెరువులు మరియు గోదావరి, మానేరు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉన్నాయని ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా జిల్లా అధికారుల సూచనలను పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి, క్షేత్ర స్థాయిలో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, వాగులు, రహదారుల వద్ద పోలీసు సిబ్బందితో పాటు బారికేడింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజా రక్షణే ప్రథమ లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పి కరుణాకర్ తెలిపారు. అంతకుముందు వరద తాకిడికి గురైనా మోరంచపల్లి గ్రామాన్ని ఎస్పి సందర్శించారు. మోరంచపల్లి గ్రామంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు వరదల్లో మిస్ అయినట్టు భూపాలపల్లి పీఎస్ లో సంబధిత కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. మిస్ అయిన వ్యక్తుల ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ జిల్లా పోలీసులు గాలిస్తున్నారనీ ఎస్పి తెలిపారు. ఆ తర్వాత పునరావాసం పొందుతున్న బాధితులను కలిసి, వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి డిఎస్పి, ఏ రాములు, సిఐలు వేణు చందర్, రామ్ నర్సింహారెడ్డి, కిరణ్, రంజిత్ రావు, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణ్ ఉన్నారు.