జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎస్పి పుల్లా కరుణాకర్
భూపాలపల్లి, ఆగష్టు 6(అక్షర సవాల్):
తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు, స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ , తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ కోసం తన కొన ఊపిరి వరకు పోరాటం చేశారని, తన జీవితాన్ని అంకితం చేసి, మలి దశ ఉద్యమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కి మార్గదర్శిగా ఉన్నారని, రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయుడు, తెలంగాణ స్పూర్తి ప్రదాత జయశంకర్ అని, ప్రొఫెసర్ జయశంకర్ సర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సాధించుకున్న తెలంగాణ లో ప్రజల భాగస్వమ్యంతో మనరాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని, ఆచార్య జయశంకర్ ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని ఎస్పి పేర్కొన్నారు.
ప్రొ. జయశంకర్ సార్ కి నివాళులు అర్పించివారిలో అదనపు ఎస్పీ అడ్మిన్ రామోజు రమేష్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ వి. శ్రీనివాస్, భూపాలపల్లి సిఐ రామ్ నరసింహారెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి, వైస్ చైర్మన్ హరిబాబు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్, భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీసు అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.