శంకర్ గౌడ్ కుటుంబానికి రూ కోటి నష్టపరిహారం
సిపిఐ నాయకులు డిమాండ్
నల్లబెల్లి, అక్షర సవాల్: ఆర్టీసీ కార్మికులతో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో అతని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నల్లబెల్లిలో జరిగిన సమావేశంలో సిపిఐ నాయకులు పరికి కోర్నేలు, బట్టు సాంబయ్య, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం, జి రాములు మాట్లాడుతూ ప్రజారవాణా వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగాలని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. తెలంగాణ సాధన తర్వాత కూడా పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాలకు ఆశించిన మేలు జరగలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. 52 రోజుల సమ్మె సమయంలో 30 మంది కార్మికులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు. ఈ ఆలస్యమే కార్మికుల అసంతృప్తికి కారణమైందని, శంకర్ గౌడ్ ఆత్మబలిదానానికి దారితీసిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలతో పాటు అదనంగా రూ.90 లక్షలు చెల్లించి మొత్తం కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, యూనియన్ ఎన్నికలు వంటి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలన్నారు.


