ప్రజల ఫిర్యాదులపై స్పందించాలి : ఎస్పి
భూపాలపల్లి , జూలై 30(అక్షర సవాల్):
పోలీస్ సిబ్బంది డయల్ 100, 112 నంబర్లకు బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి మంగళవారం డయల్ 100, 112 కాల్స్పై స్పందన, జిల్లా అధికారులు, సిబ్బంది పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందికి ఈ సందర్బంగా సూచనలు చేశారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ నిరంతరం 24/7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో విజుబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. సమస్యాత్మక, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ఎస్హెచ్ఓలు తప్పనిసరిగా సందర్శించాలని ఎస్పి ఆదేశించారు. కాల్స్ వచ్చిన తర్వాత బాధితులను చేరుకునే సమయం తగ్గేలా సమర్థవంతంగా పనిచేయాలని, తొందరగా సంఘటనా స్థలాన్ని చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు.