ఆత్మకూర్ కు అభివృద్ధి జోరు
రూ 54 కోట్ల సోలార్ ప్రాజెక్ట్తో ప్రతి ఇంటికి విద్యుత్
రోడ్లు, చెత్త శుద్ధికరణ ప్లాంట్ ప్రారంభం
ఆత్మకూరు, అక్షర సవాల్: ఆత్మకూర్ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు నేతృత్వంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించేలా ₹54 కోట్ల పైలట్ ప్రాజెక్ట్కు ఆమోదం లభించింది. రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని సర్పంచ్ తెలిపారు.
రోడ్ల నిర్మాణానికి వేగం
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ₹35 లక్షలతో ఎస్సీ కాలనీలో రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. జనరల్ ఫండ్ నుంచి ₹30 లక్షలతో బీసీ, ముదిరాజ్ కాలనీల్లో సీసీ రోడ్ల పనులు చేపట్టారు. గెలిచిన మూడు నెలల్లోనే పనులు ప్రారంభించడం విశేషం.
ప్లాస్టిక్ చెత్త శుద్ధికరణ కేంద్రం
డంపింగ్ యార్డ్ సమస్యకు చెక్ పెట్టేందుకు ₹60 లక్షలతో ప్లాస్టిక్ చెత్త శుద్ధికరణ ప్లాంట్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
డ్రైనేజీలు, సమగ్రాభివృద్ధి
గ్రామపంచాయతీ నిధులతో పలు కాలనీల్లో సైడ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అండదండలతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు మాట్లాడుతూ, “ఆత్మకూర్ను రాష్ట్రానికే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడం లక్ష్యం. త్వరలో జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా నిలిపే దిశగా కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు. గ్రామ ప్రజల మద్దతుతో ఆత్మకూర్ అభివృద్ధి కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది

