Trending Now
Monday, March 9, 2026

Buy now

Trending Now

కొమ్మాల ఆలయంలో పరిపాలనా కలకలం

కొమ్మాల ఆలయంలో పరిపాలనా కలకలం

 

కొమ్మాల ఆలయ ఈవో ఉన్నట్టా… లేనట్టా?

జాతర వేళ అధికారిణి తీరుపై తీవ్ర విమర్శలు

ఎమ్మెల్యే సమీక్షలోనే దురుసు ప్రవర్తన…

ఫోన్ చేసినా స్పందన లేదు…

గత సస్పెన్షన్‌పై మళ్లీ చర్చ…

 

గీసుకొండ, మార్చి 8 అక్షర సవాల్:

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రసిద్ధ కొమ్మాలగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పరిపాలనపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చే కొమ్మాల జాతర సమయంలో ఆలయ పరిపాలనలో స్పష్టత లేకపోవడం, అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడటం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆలయానికి అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ఉన్నారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు భక్తులు, స్థానికులు, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. జాతర ఏర్పాట్ల సమయంలో ఆలయ కార్యక్రమాలను ఒక మహిళా అధికారి ప్రధానంగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆమె అధికారిక హోదా ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దేవాదాయ శాఖ తరఫున నియమిత ఈవో ఉన్నారా? లేక తాత్కాలికంగా ఎవరో బాధ్యతలు నిర్వహిస్తున్నారా? అన్న విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోవడం ఆలయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొమ్మాల జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ శాఖల సమీక్ష సమావేశంలో కూడా ఆ మహిళా అధికారిణి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. సమావేశానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఆమె దురుసుగా ప్రవర్తించినట్లు పలువురు పేర్కొంటున్నారు. సమన్వయంతో ముందుకు సాగాల్సిన అధికారిక సమావేశంలోనే ఇలాంటి ప్రవర్తన కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం. ఇదిలా ఉండగా ఆలయ పరిపాలనకు సంబంధించిన అంశాలపై వివరాలు తెలుసుకోవడానికి విలేకరులు పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజలకు సమాచారం అందించే బాధ్యత ఉన్న అధికారులే మీడియా ప్రతినిధుల ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని జర్నలిస్టు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా సమాచారం కోరిన విలేకరులతో ఆ మహిళా అధికారి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను గౌరవించాల్సిన అధికారిణి ఈ విధంగా వ్యవహరించడం సరైనదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ అధికారిణి గతంలో కూడా కొన్ని కారణాలతో సస్పెండ్ చేయబడినట్టు స్థానికంగా చర్చలు వినిపిస్తున్నాయి. గతంలో ఎలాంటి కారణాలతో ఆమెపై చర్యలు తీసుకున్నారు? తిరిగి అదే బాధ్యతల్లో ఎందుకు తీసుకొచ్చారు? అన్న అంశాలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. వివాదాలకు కారణమైన అధికారిని మళ్లీ కీలక బాధ్యతల్లో కొనసాగించడం వెనుక కారణాలు ఏమిటన్నది దేవాదాయ శాఖ స్పష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలివచ్చే కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సమయంలో ఆలయ పరిపాలనలో ఇలాంటి గందరగోళం నెలకొనడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, నిర్వహణ వంటి కీలక అంశాల్లో అధికారులు అందుబాటులో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో ఇలాంటి నిర్లక్ష్యం కనిపించడం సరైంది కాదని స్థానికులు అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొమ్మాల దేవస్థాన పరిపాలనపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్పష్టత ఇవ్వాలని భక్తులు, స్థానికులు, జర్నలిస్టు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆలయానికి నిజంగా ఈవో ఉన్నారా? ప్రస్తుతం బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు? గతంలో సస్పెన్షన్‌కు కారణాలు ఏమిటి? వంటి అంశాలపై అధికారికంగా వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. పారదర్శకత లేకపోతే ఈ వ్యవహారం మరింత పెద్ద వివాదంగా మారే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు.

సంపాదకీయ వర్గాల అభిప్రాయం:

వేలాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వంటి ప్రముఖ ఆలయాల్లో పరిపాలన పారదర్శకంగా ఉండడం అత్యంత అవసరం. అధికారుల నిర్లక్ష్యం, స్పష్టతలేమి, బాధ్యతారాహిత్యం కొనసాగితే భక్తుల విశ్వాసానికి భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే దేవాదాయ శాఖ స్పందించి నిజానిజాలు వెల్లడించి, అవసరమైతే విచారణ జరిపించాలని వారు సూచిస్తున్నారు.

Related Articles

Latest Articles