ఆటో ప్రమాదంలో చూపు కోల్పోయిన చిన్నారి
మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయలు
మంగపేట/తాడ్వాయి,మార్చి 30, అక్షర సవాల్: ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో జరిగిన ఒక విషాదకర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఆటో బోల్తా పడిన ఘటనలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి, తన చూపును కోల్పోయింది. తాడ్వాయికి చెందిన రజిత తన కుమార్తె మిల్కీతో కలిసి ఆటోలో రంగాపురం వెళ్తుండగా, మార్గమధ్యంలోని ఒక మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు కాగా, చిన్నారి మిల్కీ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే చికిత్స నిమిత్తం ములుగు, అనంతరం వరంగల్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, చిన్నారికి తగిలిన గాయాల కారణంగా చూపు కోల్పోయినట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిన్నారిని హైదరాబాద్కు రిఫర్ చేశారు.

