కాశిబుగ్గ అంబేద్కర్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం
వరంగల్, మార్చి 1 అక్షర సవాల్: మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాశిబుగ్గ పట్టణంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ సెంటర్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు పలికారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమం ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల క్లెమెంట్ అధ్యక్షతన జరిగింది. మాదిగ అమరవీరుల సంస్కరణ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దళితరత్న కేదాశి మోహన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, గత 32 ఏళ్లుగా ఏబిసిడీ వర్గీకరణ సాధన కోసం పోరాడిన అమరవీరుల ఆత్మబలిదానాల ఫలితమే వర్గీకరణ సాధ్యమైందన్నారు. “ఏబిసిడీ వర్గీకరణతో మన పిల్లలు చదువులో, ఉద్యోగాల్లో, స్టడీ అడ్మిషన్లలో ముందుండాలి. ఇది అమరవీరుల కల,” అని కేదాశి మోహన్ పేర్కొన్నారు. వర్గీకరణను మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మాదిగలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, బాధ్యులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత జోసెఫ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్ముల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందులో సురేష్, జిల్లా యువసేన అధ్యక్షులు సాగర్ దుగ్గొండి, అధికార ప్రతినిధి నల్ల బాబురావు, నర్సంపేట ఇంచార్జ్ ఆకులపల్లి ఉప్పలయ్య, గీసిగొండ మండల అధ్యక్షులు బరిగల యాకూబ్, సంగెం మండల అధ్యక్షులు జంగిలి రాజు తదితరులు పాల్గొన్నారు.


