ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి -భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు
భూపాలపల్లి, జనవరి 27(అక్షర సవాల్):
జిల్లా కేంద్రంలో శనివారం ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎస్ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయగా భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేత్కర్ సెంటర్ నుంచి జయశంకర్ విగ్రహం వరకు ఆటోలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్స్లు తప్పకుండా తీసుకోవాలన్నారు. తాగి వాహనాలు నడపవద్దని,. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ర్టేషన్ నెంబర్ కనబడేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్ఐ శ్రావణ్, భూపాలపల్లి ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, పోలిసు సిబ్బంది, ఆటో యూనియన్ నేతలు పాల్గొన్నారు.