వాలంటీర్ల సాహసంతో పెద్ద ప్రమాదం తప్పింది
గీసుగొండ, మార్చి 5 అక్షర సవాల్:
గీసుకొండ, వరంగల్ జిల్లా ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద గురువారం అగ్నిప్రమాదం సంభవించి కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జాతర సందర్భంగా గుట్ట పరిసరాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే జాతరకు సేవలందిస్తున్న వాలంటీర్లు వెంటనే అప్రమత్తమై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముందుకు వచ్చారు. బకెట్లలో నీటిని తీసుకువచ్చి మంటలపై పోస్తూ అగ్నిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మార్వో, ఎస్సై కుమార్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అగ్నిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముఖ్యంగా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. వారి తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు చూపిన సేవాభావం, చాకచక్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు



