రథోత్సవానికి భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు
గీసుకొండ, అక్షర సవాల్:
కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథోత్సవ వేడుకల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) పాక శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న రథోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రథోత్సవం జరిగే మార్గాలు, ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు నిరంతరం నిర్వహించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఎక్కడా తోపులాటలు జరగకుండా బారికేడ్లు, క్యూ లైన్లను పర్యవేక్షించాలని తెలిపారు. రథోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కన్నెబోయిన యమున ప్రవీణ్ యాదవ్, ఉత్సవ కమిటీ ఛైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆర్. శంకర్ రావు, సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

