కొమ్మాల గుట్టలో ఘనంగా పారువేట ఉత్సవం
చక్రస్నాన పుష్కరిణి ప్రారంభం
భక్తులతో కళకళలాడిన దేవస్థానం
గీసుకొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన పారువేట ఉత్సవం భక్తుల సందడి మధ్య ఘనంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శోభాయాత్రగా తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ ఉత్సవం భక్తి వాతావరణాన్ని మరింత పెంచింది. ఈ సందర్భంగా స్వామివారి చక్రస్నానం కోసం నూతనంగా నిర్మించిన చక్రస్నాన పుష్కరిణిని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ విరాటి స్వర్ణ రవీందర్ రెడ్డి దంపతుల సహకారంతో ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే భక్తుల సహకారంతో దేవస్థానానికి గజవాహనం, హంసవాహనం కూడా నూతనంగా సమకూర్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వాహనాలపై స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ విరాటి రవీందర్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. కొమ్మాల గుట్ట దేవస్థానం ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.



