మరియపురంలో నేడు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ
ఎర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద
ప్రజాప్రతినిధులకు 99 రోజుల ప్రణాళికపై అవగాహన
గీసుగొండ, అక్షర సవాల్:
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం గ్రామంలో నేడు కీలక శిక్షణ కార్యక్రమానికి వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం’పై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు మరియపురం గ్రామంలోని ఎస్ఎస్ గార్డెన్లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద బుధవారం జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమావేశ ప్రాంగణం, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అలాగే గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలు విధానం, లక్ష్యాలు, ప్రజా సేవల మెరుగుదలపై సమగ్ర అవగాహన పొందనున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, వై.వి. గణేష్, సీఈవో రాంరెడ్డి, డిపివో కటకం కల్పన, సంబశివరావు, తహసీల్దార్లు రియాజుద్దిన్, రాజ్ కుమార్, డీఎల్పీవో రాజీవ్ కుమార్, ఎంపీడీఓలు వి. కృష్ణవేణి, అరుంధతి, శ్రీనివాస్ రావు, కిషన్, శంకర్, ఎంపీఓ పాక శ్రీనివాస్, శేషాంజన్ స్వామి, శ్రీధర్, ప్రకాష్, రవి, ఏపీఓ చంద్రకాంత్, ఆర్ఐ సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి పీ. సరిత తదితరులు పాల్గొన్నారు.

