పట్టుదలతో చదివి పదిలో సత్తా చాటాలి
వంచనగిరి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతుల ప్రకటన
పరీక్షల మెటీరియల్, ప్యాడ్ల పంపిణీ
గీసుగొండ, అక్షర సవాల్:
వంచనగిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో, భావోద్వేగ భరితంగా సాగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తగళ్లపల్లి రాజేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, కృషి ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. ముఖ్య అతిథులుగా హాజరైన 8వ వార్డు సభ్యుడు జెట్టి రాజేష్, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు అడువాల అఖిల్, షాబోతు అనిల్లు మాట్లాడుతూ, విద్యార్థులు చదువులో రాణించి గ్రామానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాబోయే పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి మూడు స్థానాల్లో నిలిచే విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ. కమల, కె. మధుకర్, కె. రంగోపాల్ రెడ్డి, ఎండీ సలీం పాషా, ఎస్. దిలీప్ కుమార్, కె. లక్ష్మయ్య, ఎం. కృష్ణ, కె. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

