గంగదేవిపల్లి ‘ధ్రువతార’కు కన్నీటి నీరాజనం
కొవ్వొత్తుల వెలుగులో రాజమౌళి సంస్మరణ
కదిలివచ్చిన ఊరువాడ
గీసుగొండ, మార్చి 15 అక్షర సవాల్: ఆదర్శ గ్రామంగా పేరొందిన గంగదేవిపల్లి రూపకర్త, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని గ్రామస్థులు భావోద్వేగంతో పేర్కొన్నారు. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన రాజమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గ్రామమంతా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించింది. వీవో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిశ్శబ్ద ర్యాలీలో మహిళా సంఘాలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో వెలుగుతున్న కొవ్వొత్తులు పట్టుకుని గ్రామ వీధుల గుండా సాగిన ర్యాలీలో “అమర్ హై రాజమౌళి” నినాదాలు మారుమోగాయి. తమ గ్రామాన్ని దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడిని స్మరించుకుంటూ పలువురు గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
అభివృద్ధికి నిలువుటద్దం – రాజమౌళి నాయకత్వం
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గంగదేవిపల్లి నేడు ఆదర్శ గ్రామంగా నిలవడానికి రాజమౌళి దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత ప్రధాన కారణమని కొనియాడారు. గ్రామ ప్రజలను ఏకం చేసి స్వయం సమృద్ధి దిశగా నడిపించడం, సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేయడం ఆయన ప్రత్యేకతగా గుర్తుచేసుకున్నారు. ఈ నివాళి కార్యక్రమంలో ప్రస్తుత సర్పంచ్ కూసం స్వరూప–రమేష్, ఉపసర్పంచ్ మెడిద ప్రశాంత్, కామ్రేడ్ గోనే కుమారస్వామి, సి.ఏ. పెండ్లి జనార్ధన్, వీవో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి ఘనంగా అశ్రునివాళులు అర్పించారు.

