ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల పాట్లు..
స్కానింగ్ కోసం తప్పని పడిగాపులు
వరంగల్, అక్షర సవాల్:
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో రోగనిర్ధారణ పరీక్షల కోసం వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు.ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వందలాది మంది రోగులు క్యూ కడుతుండగా, రోజుకు కేవలం వంద మందికి మించి పరీక్షలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే పేద రోగులు, పరీక్షల కోసం రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు స్పందించి స్కానింగ్ సేవలను మెరుగుపరచాలని బాధితులు కోరుతున్నారు.

