48 గంటల్లో భారీ వర్షాల హెచ్చరిక…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రైతులకు కీలక మార్గదర్శకాలు
తహసీల్దార్ మహమ్మద్ రియాజుద్దీన్
గీసుకొండ, మార్చి 18 అక్షర సవాల్: మండలంలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తహసీల్దార్ మహమ్మద్ రియాజుద్దీన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో నీటిమట్టం పెరగడం, రహదారి అంతరాయాలు, విద్యుత్ ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకూడదని, ఈత లేదా చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని తెలిపారు. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, పొలాల్లో నీరు నిల్వ కాకుండా కాలువలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని తెలిపారు. పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వర్షాల సమయంలో బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, లోతైన నీరు ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ మహమ్మద్ రియాజుద్దీన్ సూచించారు. ప్రజలందరూ ఈ సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


