పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి నిధులు..
ఎంపీ వేం నరేందర్ రెడ్డి హామీ
హైదరాబాద్, అక్షర సవాల్: కోకాపేటలో నిర్మాణంలో ఉన్న పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి త్వరలోనే ప్రభుత్వ నిధులు అందేలా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి బిసి సంక్షేమ బడ్జెట్ నుంచి నిధులు కేటాయింపునకు కృషి చేస్తానని తెలిపారు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్,అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ శనివారం హైదరాబాద్లో వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కోకాపేటలో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనం పురోగతిని నాయకులు వివరించారు. ఇప్పటికే నాలుగో స్లాబ్ పూర్తి చేసినట్లు తెలియజేసి,ఇప్పటివరకు దాతల సహకారంతోనే నిర్మాణం కొనసాగుతున్నదని,మిగతా పనుల కోసం ప్రభుత్వ సహాయం అవసరమని కోరారు. దీనిపై స్పందించిన నరేందర్ రెడ్డి,ఇతర కులాలు ఇంకా నిర్మాణాన్ని ప్రారంభించకపోయినా పెరిక కులం నాలుగో స్లాబ్ దశకు చేరుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. పెరిక కులంలో సామాజిక స్పృహ,విద్యాపట్ల అవగాహన ఎక్కువగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. భవన నిర్మాణానికి తప్పకుండా నిధులు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎల్.బి.నగర్లో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం నిర్మాణం చేపట్టడం శ్లాఘనీయమని పేర్కొంటూ,త్వరలో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.బాలికల విద్యాభివృద్ధికి ఇటువంటి వసతులు అవసరమని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని పెరిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ సహకారంతో ఆత్మగౌరవ భవనం నిర్మాణం వేగవంతం అవుతుందని సంఘ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

