నెక్కొండ భవిష్యత్తు ఏంటి
నెక్కొండ నియోజకవర్గం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
తెలంగాణ శ్రీనివాస్ నాయక్ ఫైర్
నెక్కొండ,మార్చి 25 అక్షర సవాల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డిలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఉద్యమనేత,తెలంగాణ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.కులం,మతం,ప్రాంతం,డబ్బు,అధికార వ్యవస్థ ప్రభావంతో డిలిమిటేషన్ మర్మగర్భంగా సాగుతోందని ఆరోపించిన ఆయన,ఇది నిమ్న వర్గాల ఐక్యతను దెబ్బతీసే విభజించు-పాలించు విధానంగా మారే ప్రమాదం ఉందన్నారు.కమిషన్ కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ,రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల రూపకల్పన జరిగే అవకాశముందని,దీనివల్ల ప్రతిపక్షాలు బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలు మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.నెక్కొండ ప్రాంతం గతం నుంచే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని,డిలిమిటేషన్ అనంతరం నెక్కొండ ప్రత్యేక నియోజకవర్గం అవుతుందా? లేక పక్క జిల్లాలోని కొత్త నియోజకవర్గంలో కలిసిపోతుందా? అన్న సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయని,ఈ అనుమానాలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,నెక్కొండను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయకపోతే తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడనని తెలంగాణ శ్రీనివాస్ నాయక్ స్పష్టం చేశారు.


