భూ వరాహ యాగానికి కొమ్మాల పవిత్ర మట్టి
దేవస్థానం ఈవో పి.ప్రసాద్
గడప గడపకు నరసింహం కార్యక్రమంలో భాగంగా స్వామీజీ సందర్శన
రైతుల సంక్షేమమే లక్ష్యం
కొమ్మాల,మే05,అక్షర సవాల్: భద్రాచలంకి చెందిన గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం నిర్వాహకులు డా, కృష్ణ చైతన్య స్వామి “గడప గడపకు నరసింహం” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 12 గంటలకు శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి. ప్రసాద్ తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం సాలగ్రామ నరసింహ స్వామి ఆశ్రమంలో నిర్వహించనున్న భూ వరాహ యాగం కోసం, కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి పవిత్ర మట్టిని స్వామీజీ సేకరించినట్లు ఆయన వివరించారు. రైతుల క్షేమాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ యాగం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. తదుపరి స్వామీజీ భక్తులకు ఆశీస్సులు అందజేసినట్లు ఈవో పి. ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు.


