Trending Now
Sunday, January 25, 2026

Buy now

Trending Now

మేడారంను సందర్శించిన సీపీఐ నేత నారాయణ

మేడారంను సందర్శించిన సీపీఐ నేత నారాయణ

-నారాయణను సత్కరించిన రాష్ట్ర మంత్రి సీతక్క

 

-సమ్మక్క- సారలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి

– సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ

ములుగు/మేడారం : సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సీపీఐ శతవసంతాల బహిరంగ సభ, పార్టీ జాతీయ కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలలో పాల్గొన్న అనంతరం నారాయణ పార్టీ నాయకులతో కలసి మేడారం సందర్శించారు. తొలుత ములుగు జిల్లా కేంద్రంలో డాక్టర్ కె. నారాయణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నారాయణను శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తాడ్వాయి మండలం లోని మేడారాన్ని నారాయణ సందర్శించి లక్షలాది మంది దర్శించుకునే జాతర ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతర పునరుద్ధరణ పనులను పరిశీలించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్లు ఖర్చు చేసి జాతర పునరుద్ధరణ పనులు చేపట్టడం హర్షణీయమని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారంకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిధులను కేటాయించక పోవడం సరికాదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న జాతర పట్ల వివక్ష కేంద్రానికి సరికాదని సూచించారు. సమ్మక్క-సారలమ్మ లు స్వేచ్ఛా, సమానత్వం కోసం, శాంతి, ఐకమత్యం కోసం పోరాడిన వీరవనితలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ సారధి,రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, నాయకులు, యండి అంజధ్ పాష, బండి నర్సయ్య, ఇంజం కొమురయ్య, చిక్కుల వెంకటేష్, పాత్రికేయులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles