మార్చి 31న వరంగల్లో రాష్ట్ర రైతు సదస్సు
రైతులు భారీగా హాజరై జయప్రదం చేయాలి
సోమిడి శ్రీనివాస్ పిలుపు
గీసుకొండ, మార్చి 29 అక్షర సవాల్: గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ సమావేశం బెంబిరి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మార్చి 31న వరంగల్ నగరంలోని రైతు భవనంలో జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పూర్తిస్థాయిలో విక్రయించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఇంకా కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీంతో కొంతమంది రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరలకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. క్వింటాల్కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతూ, ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ప్రారంభించి, ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ, ఈ నెల 31న వరంగల్ నగరంలోని అబ్బానికుంట రైతు భవనంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితర మేధావులు హాజరవుతారని చెప్పారు. రైతులు, కూలీలు భారీ సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు మోకిడే పీరయ్య, గ్రామ రైతులు యాదగిరి, నర్సింగరావు, ఎండి బషీర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

