Trending Now
Thursday, May 29, 2025

Buy now

Trending Now

సీఎంకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ లేఖ..

రాష్ట్ర ముఖ్యమంత్రికి .. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ లేఖ

  • లేఖ లో ఏముందంటే..!

గౌరవ ముఖ్యమంత్రి, శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం గారికి..
ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్ర్యాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం.1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఆదిగా, కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది.
ఫజల్ అలీ కమీషన్ సిఫార్సులను కాలరాచి, తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేసి, తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం.
ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోయింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలిమలుపు.టి ఆర్ ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నిచ్చింది, తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది. తెలంగాణ డిమాండ్ కు విస్తృత ఆమోదాన్ని సాధించింది. ఎన్నికలను ప్రభావితం చేసేస్థాయికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను చేర్చింది. ఊరూరా వాడవాడలా సభలూ సమావేశాలూ నిర్వహించి భావజాల వ్యాప్తి చేసింది. ఎన్నికల ద్వారా ప్రజల తీర్పును రాబట్టి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోగా, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు పాల్పడింది.
కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులను, ఎం.పీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ పదవులను తృణప్రాయంగా వదులుకొని ఉద్యమ బాట పట్టిన టి ఆర్ ఎస్ అనేక పోరాట రూపాల ద్వారా తెలంగాణ ఆకాంక్షని లోకానికి చాటింది. చివరికి నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వచ్చింది. యావత్ తెలంగాణ నా నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచి భూమ్యాకాశాలను ఒక్కటి చేసే విధంగా ఉద్యమిస్తే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది.సమైక్య పాలకుల ఒత్తిడికి తలొగ్గి, చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ మరోసారి ఘోరమైన మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకు గాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడుకోలేదు. పైనుంచీ దయతో మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య, అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ వైఖరి పూర్తిగా గర్హనీయం. ఈరకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయ అవసరాల కోసం కాకుండా, మనస్ఫూర్తిగా కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే, కొంతలో కొంత అయినా అది పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది.మీ పార్టీ పరిస్థితి అది అయితే

ఇక మీ పరిస్థితి! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటినుండి ఇప్పటివరకూ జై తెలంగాణ అనే నినాదాన్ని పలక లేదు. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.
ఇక ముందయినా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీనుంచి కోరుకుంటున్నది.
మీరు ముఖ్యమంత్రయి ఆరు నెలలవుతున్నా ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయ పరిచారు.

మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒక్కటే. కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదు. ఇక మారదు. ఇక ముందు మారే అవకాశం లేదు. నాటికీ, నేటికీ ఎన్నటికీ కాంగ్రెస్కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప, మనఃపూర్వక ఆమోదం కాదు. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగుతున్న దాదాపు ఈ ఆరునెలల కాలంలో ప్రజా జీవితం అస్తవ్యస్తమై పోయింది. ముఖ్యంగా రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది. సస్యశ్యామలమై, సుసంపన్నమైన తెలంగాణ బతుకు చిత్రాన్ని మీ అసమర్థ పాలన చిదిమివేసి, ఛిద్రం చేసింది. గత పదేండ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వ దార్శనికతతో శాశ్వతంగా దూరమైన కష్టాలు, సమస్యలన్నీ..మీ అసమర్థ పాలనతో ఆర్నెల్లలోనే తిరిగి ప్రత్యక్షమైతున్నయి. ఈ వింతను విషాదాన్ని సబ్బండ వర్గాల ప్రజలు విస్తుబోయి చూస్తున్నారు. ఇంతలోనే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఎందుకు మారుతున్నదో అర్థంకాక తెలంగాణ సమాజం అయోమయానికీ ఆవేదనకు గురవుతున్నది.
బి ఆర్ ఎస్ పరిపాలనా కాలంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకూ 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరిగింది. అత్యుత్తమ విద్యుత్తు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించింది. కాంగ్రేస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి ఎన్టీపీసీ ద్వారా సుమారు 1400 మెగావాట్ల అదనపు విద్యుత్తు సమకూరింది. అయినప్పటికీమీ అసమర్థతో అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ మీరు రైతాంగం ఉసురుపోసుకుంటున్నారు.
తొమ్మిది సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాఘాటంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారం లోకి రాగానే ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతుందో అర్థం కాక నేను నా విస్మయాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పరిణామం రాష్ట్ర ప్రతిష్టకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారిందనేది నిర్వివాదాంశం.
మీరు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోవటంతో లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయినయి. చాలీచాలని కరెంటుతో లక్షల ఎకరాలు ఎండిపోయినయి, రైతన్నల గుండెలు బద్దలై పోయినయి.
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, కరెంటు కోతలకు ఆకాల వర్షాలు తోడయ్యి పంటలు దెబ్బతినిపోయాయి. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. వారికి భరోసా నిచ్చే చర్యలేవీ చేపట్టలేదు.
ప్రపంచమే మెచ్చిన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నది. అన్నదాతలు పంట పెట్టుబడి కోసం ఎవరి వద్దా చేయి చాచవలసిన పరిస్థితి ఉండకూడదనే ఉదాత్తమైన లక్ష్యంతో, మా హయాంలో
రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినం. సమర్థవంతంగా అమలుచేసినం. ఆరు సంవత్సరాలలో 70 లక్షలమంది రైతులకు 73 వేల కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కింద అందించినం. కరోనా ఉత్పాతం విరుచుకు పడి, రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బతిన్న దశలో సైతం మేము రైతులకు లోటు రానివ్వలేదు. అంత క్లిష్ట సమయంలో కూడా సకాలంలో రైతుబందు సహాయం అందించినం. మీరు అధికారం లోకి వచ్చిన తరువాత రైతుబంధు సహాయం సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. సరైన సమయంలో పంట పెట్టుబడి అందకపోవడంతో పాటూ, డిసెంబర్ 9 లోపు మీరు చేస్తామని చెప్పిన రుణమాఫీ చెయ్యక పోవడంతో రైతులకు అన్ని మార్గాలు మూసుకు పోయాయి. చివరికి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుర్గతిలోకి రైతులు నెట్టబడ్డారు. మరో వైపు రైతు బంధు అడిగితె చెప్పుతో కొడుతామని మీ మంత్రివర్గ సహచరుడు దురహంకారంతో చేసిన వ్యాఖ్య విని యావత్ తెలంగాణ కోపంతో ఉడికిపోయింది. మీరు సదరు మంత్రిని మందలించిన పాపాన కూడా పోలేదు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని మీరు రైతులను మన్నింపు కోరలేదంటే రైతుల పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చులకనభావం స్పష్టమైతున్నది.సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై మీ ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన బి ఆర్ ఎస్ ను ఆహ్వానించక పోవటం మీ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం. తెలంగాణ పోరాటంలో అన్నీ తానై నిలిచిన బి ఆర్ ఎస్ ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తామని అవమానిస్తున్నారు. మీ వైఫల్య్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. వెయ్యి సంవత్సరాల కిందనే గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానిస్తున్న మీ పాపానికి నిష్కృతి లేదు. ప్లేగు వ్యాధి మృతుల స్మృత్యర్థం కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన హైదరాబాద్ ఐకాన్, చార్మినార్ కు మలినాన్ని ఆపాదిస్తూ తెలంగాణ ప్రజల, హైదరాబాద్ ప్రేమికుల, మనోభావాల్నిదారుణంగా గాయపరుస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం, అవమానకరం.
సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు.
ఇక మీరు నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, 15 సంవత్సారాల పాటు ప్రజా పోరాటాన్ని నడిపించి, తెలంగాణ డిమాండుకు మద్దతుగా రాష్ట్రం లోని, దేశం లోని పార్టీల మద్దతు కూడగట్టి, స్వరాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవినీ, ఎం పీ పదవినీ తృణప్రాయంగా వదిలివేసి, చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నావంటి వాడిని మీరు ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది.
తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు, వేదికపై స్థానం గానీ, రాష్ట్ర సాధనలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కాని కల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట .నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమాన పరచదలుచుకున్నమీ దురుద్దేశ్యాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు. రానున్న కష్టాలను తలచుకుని తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది. ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది.
ఒకవైపు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆక్రోశం, పని కోల్పోయినందుకు ప్రాణాలు తీసుకుంటున్న చేనేత కార్మికుల దుఃఖం, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల ఆవేదన, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ తల్లడిల్లుతున్న నిరుద్యోగుల్లో ఆవరించిన నిస్తేజం, తాగే నీళ్ళకోసం తండ్లాడుతున్న తల్లుల ఆయాసం, కరెంటు కోతలతో మసక బారుతున్న రాష్ట్ర ప్రతిష్ట, కుంటు పడుతున్న పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతి, ఒకటని కాదు, అన్ని రంగాలు అరునెలల్లోనే ఆగమైపోయిన విషాదం. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజ కరమైన సందర్భమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో …ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా వుంది. అందువల్ల… పైన పేర్కొన్న కారణాల రీత్యా, ప్రజాజీవితాన్ని క్రమ క్రమంగా కల్లోలంలోకి నెట్టుతున్న మీ పాలననూ.. మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లను అడుగడుగునా అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరినీ, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలనూ నిరసిస్తూ.. మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బి ఆర్ ఎస్ పార్టీ పాల్గొనబోవటం లేదని తెలియ జేయటానికి విచారిస్తున్నాను.
ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారనీ, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను.

                జై తెలంగాణ! జై భారత్!!

                                  ఇట్లు*

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు*

 

Related Articles

Latest Articles