ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలి: ఎస్పి
భూపాలపల్లి,జూలై 22 (అక్షర సవాల్):
ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీ, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పి పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ కృషి చేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. షీ టీమ్స్ ఆవశ్యకత, సైబర్ క్రైమ్స్, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదిలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఎస్పి తెలిపారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి, బాధితులకు అండగా నిలవాలని తెలిపారు.పోలీసు స్టేషన్లో నమోదు అయిన ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కోర్టుల్లో శిక్షల శాతం పెంచేందుకు పోలీసు అధికారులు సమర్థవంంగా పనిచేయాలని ఎస్పి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి, డిఎస్పి జానీ నరసిoహులు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.