వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ .
– శాంతి సామరస్యాలకు ప్రతీక మన జిల్లా
– మండపాల వద్ద నిబంధనలు పాటించాలి.
– డిజె శబ్ధాలు వద్దు – భక్తి భావంతో పండుగ జరుపుకోవాలి
– గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి, ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకోవాలి.
భూపాలపల్లి, సెప్టెంబర్ 16 (అక్షర సవాల్):
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుందని ఎస్పి పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద డిజెలకు అనుమతి లేదని, ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని అన్నారు. సోదరభావం అనేది తెలంగాణ రక్తంలోనే వుందని ఎస్పీ కరుణాకర్ పేర్కొన్నారు. గణేష్ మండపాలు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయవద్దని, వాహనాలకు దారి వదలాలని ఎస్పీ కోరారు.గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని, అన్లైన్ అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in/index.htm కింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
పోలీసు శాఖ సూచించిన నియమాలు పాటించాలి.
- మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
- ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థలం యొక్క యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి.
- ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి.
- భక్తులు వచ్చిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
- ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు.
- విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి.
- వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.
- ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయద్దు.
- మండపాల వద్ద భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి.
- నిర్ణీత సమయంలో మాత్రమే మైక్ లు పెట్టాలి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.
ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, అత్యవసర సమయంలో స్థానిక పోలీసులకు గానీ, డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్పి కరుణాకర్ కోరారు.